B6 NEWS
జయశంకర్ భూపాలపల్లి,
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులుతో కలిసి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, 01 జనవరి 2004 నుండి 31 డిసెంబర్ 2004 వరకు జన్మించిన పిల్లల వివరాలను స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి వారిని నూతన ఓటరుగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా గత సంవత్సరం కాలంలో మరణించిన వారి వివరాలను పంచాయతీ, మున్సిపాలిటీ నుండి సేకరించాలని సూచించారు.పంచాయతీలు మున్సిపాలిటీల నుండి వచ్చిన జాబితాను బూత్ స్థాయి అధికారులకు పరిధి నిర్దేశించి బాధ్యతలు అప్పగించాలని, నూతన ఓటరు నమోదు, మరణించిన వారి పేర్లు తోలగించే ప్రక్రియ చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో బూతు స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు సదరు సమావేశాలు ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రతి బూతు కవర్ అయ్యేలా స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 వరకు జిల్లాలో ఉన్న గర్భవతులు,బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయడం పై శ్రద్ద వహించాలని, అంగన్ వాడి టీచర్లను, సహాయకులను వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఉన్న కళాశాల నుంచి విద్యార్థుల్లో అంబాసిడర్ లను ఏర్పాటు చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో విద్యాసంస్థల్లో చదువుతున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 24 వరకు జిల్లాలో ఉన్న ఆసుపత్రులలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని, జిల్లాలో ఉన్న వ్యాపారులతో చర్చించి వారి సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించి వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఓటరు ప్రాముఖ్యత ను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ వాటిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా మాధ్యమా లలో విస్తృత ప్రచారం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలియచేశారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రభాకర, ఆర్.డి.ఓ.శ్రీనివాస్, సి.ఈ.ఓ. జెడ్పి శోభారాణి,డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్, తసీల్దార్ ఇక్బల్ ఎన్నికల డీప్యూటి తహసిల్దార్, ఈ.డి.యం., తదితరులు పాల్గొన్నారు